ప్రొ. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం !!


డాక్టర్ రాహుల్ రాజారామ్

తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (జాక్) లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రెడ్డి రాజకీయ నాయకత్వ వైఫల్యంపై డా. రాహుల్ రాజారామ్ చేసిన విశ్లేషణ ఇది. ఇందులో కొంతభాగం మార్చ్ 1న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కారణాలు తెలియదుగానీ ఆంధ్రజ్యోతి పూర్తిగా ప్రచురించలేక పోయింది, వ్యాసంలో కీలకమైన అంశాలు ఉన్నందునపూర్తి వ్యాసాన్ని  రచయిత అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాం - నీలమేఘం 

ప్రత్యేక తెలంగాణకోసం అకుంఠిత దీక్షతో ఒక దశాబ్ద కాలానికి పైగా రాజీ లేని పోరాటం చేసి నిలబడిన ఉపాధ్యాయుడు, పైగా ఉద్యమ కాలంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె సి ఆర్ కు ఆత్మగా మెలిగిన  ప్రో. కోదండరామ్ తో ప్రభుత్వం వ్యవరించిన తీరు చాలామంది తెలంగాణా వాదులను,ముఖ్యంగా మేధోవర్గాలు, విద్యావంతులను విస్మయానికి గురిచేసింది. శత్రువు కూడా వ్యవహరించని రీతిలో ఆయనను అరెస్ట్ చేయడం  ఆందోళనకు గురిచేసింది. సహజంగానే ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

తెలంగాణా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా ఇది కొంత ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యానాలు, వ్యక్తమౌతున్న అభిప్రాయాలు ప్రభుత్వం అలా చేయాల్సింది కాదు అనే రీతిలో ఉంటున్నాయి. ఇది గర్హనీయం, పొలీసు చర్యను, ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సిందే.   కానీ తెలంగాణా సమాజంలో దీని ప్రభావం ఎంతమాత్రం కూడా కనిపించక పోవడం, తెలంగాణాలోని రాజకీయ పక్షాలనుంచీ కనీస మద్దత్తు కూడా దొరకక పోవడం, ప్రొ . కోదండరాం తో చిరకాల అనుబంధం కలిగిన  ప్రొ. హరగోపాల్ లాంటి ఒకరిద్దరు వామపక్ష మేధావులు, ఆయన కొన్ని దశాబ్దాలుగా పనిచేసిన పౌరహక్కుల సంఘాలు మినహా పౌర సమాజం, చివరకు మీడియా కూడా పెద్దగా స్పందించక పోవడం వంటి అంశాలను కూడా లొతుగా ఆలోచఆలోచించవలసిన అవసరం ఉంది. ఆయన అరెస్టు తరువాత  ఆవరించిన మౌనం ఆయనకున్న ఆదరణ కంటె ప్రభుట్వానికి ఉన్న ఆమొదాన్ని ససూచిస్తునందెమో అనిపిస్తుంది.    

హైదరాబాద్ లో అదికూడా ఉద్యమ వేదికగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శివరాత్రిసెలవు రోజు ఒకటి రెండు వామ పక్ష విద్యార్ధి సంఘాలు నిర్వహించిన 'బంద్' మినహా ఎక్కడా దాని ప్రభావం కనిపించలేదు. పైగా అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు.  కురవి వరకు ఆయన హెలీకాఫ్టర్ లో వెళ్లారు. అక్కడ ఆయనకు అనూహ్య స్వాగతం లభించింది. జాతరకు వచ్చిన వారితో సహా వేలాదిమంది యువకులు ఆయనకు ఘనస్వాగతంపలికారు.  అక్కడ వీరభద్రస్వామికి  మొక్కులు చెల్లించుకున్నంత సేపు హర్షధ్వానాలతో జాతర వాతావరణం హోరెత్తింది. తరువాత ఆయన శాసన సభ్యుడు రెడ్యా నాయక్ స్వగ్రామమైన ఉగ్గంపల్లికి అదే హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉంది. కానీ ప్రజల నాడిని పరిశీలించేందుకా అన్నట్టు ఆయన 22 కిలోమీటర్ల దూరం బస్సులో బయలుదేరి వెళ్లారు.ఆయన ప్రయాణమంతా జాతరలాగే సాగింది.  విద్యార్థులు, యువకులు, రైతులు, కూలీలు దారిపొడవునా నిలబడి జేజేలు పలికారు. ఆయన అదే గ్రామంలో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా విలేఖరులనుంచి కూడా ప్రొ. కోదండరాం అరెస్టు కనీస ప్రస్తావనకు కూడా రాలేదు. పైగా తెలంగాణా కు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారిని మీడియా మిత్రులు  తెలంగాణా బిడ్డలుగా నిలదీయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆయన అధికారంలోఉన్నారు కాబట్టి మీడియాను మేనేజ్ చేశారని అనుకున్నా, ప్రజలు, యువకులు, సమాజం ఎందుకు స్పందించలేదు, అది ప్రో. కోదండరాం అజెండా లోపమా, వ్యూహాత్మక తప్పిదమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణాలో ప్రతిపక్షమే లేకుండా పోయిన ఈ రోజుల్లో ప్రజలపక్షాన ఒక శక్తిగా ప్రో. కోదండరాం ఎదగాలని భావించిన వాళ్లకు,ఆయన ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి టీ ఆర్ ఎస్  కు వ్యతిరేకంగా ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడని భ్రమ పడిన వాళ్లకు ఇప్పుడు నిరాశే ఎదురవుతోంది.ప్రభుత్వం తనతో అలా వ్యవహరిస్తుందని పాపం ప్రొ . కోదండరాం కలలో కూడా ఊహించి ఉండరు. పైగా  ఇప్పుడు జాక్ శిభిరంలో తన కుడి, ఎడమల నడిచినవాళ్ళే తిరగబడడంతో  ప్రొ. కోదండరాం లో నిస్పృహ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  


ప్రొ. కోదండరాం సహజంగానే సౌమ్యుడు, మృదు స్వభావి. ఏ విషయాన్నైనా ప్రజాస్వామికి విలువలు ఉటంకిస్తూ చెప్పగల నేర్పరి. బహుశా మూడు దశాబ్దాలకు పైగా రాజనీతి శాస్త్రం బోధించడం వల్ల, పౌరహక్కుల ఉద్యమంలో పనిచేసి ఉండడం వల్ల ఆయనకు అవి అబ్బి ఉండవచ్చు. కానీ ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నది ఆయన జాక్ ప్రస్థానంలో రుజువయ్యింది. నిజానికి నిజజీవితంలో కూడా ఆయన ఎన్నడూ రాజకీయ నాయకత్వంలో లేరు. ఉద్యమంలో పేరుకే రాజకీయ జేఏసీకి చైర్మన్ గా ఉన్నా ఆయన కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారు.



స్వతంత్రంగా ఏనాడు వ్యూహ రచన గానీ, ఉద్యమ కార్యాచరణ గానీ రూపొందించలేదు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లతో పాటు వామపక్షాలనుంచి కూడా అప్పట్లో తీవ్ర విమర్శలను, నిందలు ఎదుర్కొన్నారు. తొలుత రాజకీయ జేఏసీ ఏర్పడిందికూడా కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ పార్టీలతోనే. తరువాత మిగితా పార్టీలన్నీ అందులో చేరాయి. ఆ తరువాత అన్ని పార్టీలూ  కోదండరాం స్వతంత్రంగా లేరని,  కేసీఆర్ కు మౌత్ పీస్ లా మారిపోయారని, టీ  ఆర్ ఎస్ అధికార ప్రతినిధిగా ఉంటున్నారని జేఏసీ నుంచి బయటకు వెళ్లిపోయాయి. అంతే కాదు కోదండరాం నాయకత్వాన్ని చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఏనాడూ ఆమోదించలేదు. ఆయన లో ప్రజాస్వామిక భావనలు లేకపోగా, అగ్రకుల, ఆధిపత్య ధోరణి, ఒంటెద్దు పోకడ రెండూ ఉన్నాయని పోటాపోటీ జాక్ లు ఆయన సహచర అధ్యాపకులు ప్రో. తిరుమలి, ప్రో. గాలి వినోద్ కుమార్ తదితరులు ఏర్పాటు చేశారు.  





2009-14 మధ్యకాలంలో ఈ పరిణామాలన్నీ జరిగిపోయాయి. చివరకు తెలంగాణా బిల్లు ఆమోదం పొందేనాటికి చివరకు టీఆర్ ఎస్ కూడా జేఏసీ లో లేదు. ప్రో. కోదండరాం అసమర్థ నాయకుడని, ఆయనను జేఏసీ నాయకత్వం నుంచి తప్పించి అప్పటి ఉద్యోగుల సంఘం నాయకుడు స్వామిగౌడ్ ను చైర్మన్ చేయాలని కూడా కేసీఆర్ భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు ఎన్నికల నాటికి టీఆరెస్, కోదండరాం నాయకత్వంలోని జేఏసీ మధ్య తెగదెంపులు జరిగిపోవడమే కాకుండా, రెండు వైరి శిభిరాలుగా మారిపోయాయి. కోదండరాం స్వయంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. తన అనుచరుల్లో కొందరికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇప్పించారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా టీ ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా 'ఉద్యమకారుల' కు టిక్కెట్లు ఇచ్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అనే తేడా లేకుండా ప్రచారం చేశారు.  కొండా సురేఖ, పట్నం మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమ వ్యతిరేకులకు టిక్కెట్లు ఇచ్చినందుకు టీ ఆర్ ఎస్ ను ఓడించాలని కూడా ఎన్నికలు జరిగినన్ని రోజులు ఆయన  పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ దశలో ఆయన హైదరాబాద్ నుంచే పదహారు ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు.  


అయినా ప్రజలు ఉద్యమంలో ఉన్నా లేకున్నా టీ ఆర్ ఎస్ అభర్ధులను భారీ మెజారిటీ తో గెలిపించారు. తెలంగాణా రాష్ట్ర సమితి ని ఏకైక తెలంగాణా ఉద్యమ వారసత్వ సంస్థగా గుర్తించారు. ఇది కేవలం టీ  ఆర్ ఎస్ విజయం మాత్రమే కాదు. ప్రో. కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం కూడా. ఒక రాజకీయ శాస్త్ర ఆచార్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తికి ఈ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యం. పైగా టీజాక్ ను 'కరివేపాకులా వాడుకున్నారని' ఆయన వాపోవడం అబద్ధమే కాదు, అన్యాయం కూడా.  టీ ఆర్ ఎస్ ఎన్నికల వంటలో కోదండరాం అనే కరివేపాకు లేకపోగా, ప్రో. పాపిరెడ్డి నాయకత్వంలో టీ (ఆర్ ఎస్) జాక్ కొత్తగా పుట్టింది. ప్రో. కోదండరాం విద్యావంతుల వేదికకు పోటీగా వికాస సమితి పుట్టింది. రఘు నాయకత్వంలోని విద్యుత్ ఉద్యోగులు కొందరు, విఠల్ నాయకత్వంలోని ఉద్యోగుల సంఘంలో కొందరు మినహా దేవీప్రసాద్, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ దేశ్ పాండే  ల నాయకత్వంలోని సంఘాలన్నీ ప్రో. కోదండ కు రాంరాం చెప్పి కేసీఆర్ పంచన చేరిపోయాయి. ఇదంతా వక్రీకరించ వీలుకాని అత్యంత సమీప చరిత్ర. ఇది ముమ్మాటికీ ప్రొ. కోదండరాం రాజకీయ వైఫల్యమే.! 

అయినా సరే ప్రొ . కోదండరామ్ తన వైఫల్యాన్ని గుర్తించలేదు. జాక్ ను రద్దు చేయలేదు. న్యాయంగా అయితే కేసీఆర్, జానారెడ్డి ప్రారంభించిన తెలంగాణా పొలిటికల్ జాక్ ఎప్పుడో రద్దు కావాలి. పొలిటికల్ జాక్ లో భాగస్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు అందులోంచి వెళ్ళిపోయిన మరుక్షణమే దానికి రాజకీయ నైతిక అస్తిత్వం లేదు. దానిని అప్పుడే రద్దు చేయాల్సింది. ఎందుకంటే జాక్ అనేది ఒక లక్ష్యం కోసం కొన్ని భిన్న రాజకీయ సిద్ధాంతాలున్న పక్షాలు ఏర్పాటు చేసుకునే తాత్కాలిక సంయుక్త కార్యాచరణ వేదిక. రాజకీయ పక్షాలన్నీ పక్షుల్లా ఎగిరిపోయినప్పుడే దాని ఉమ్మడి అస్తిత్వం పోయి అది ఏక పక్షం అయిపొయింది. అదికాదనుకున్నా తెలంగాణా ఏర్పాటుతో లక్ష్యం నెరవేరినందున అది సహజంగానే రద్దుకావాలి. రెండూ జరిగినా దానిని రద్దు చేయకుండా ఒక సిక్ యూనిట్ గా మిగిలిపొయిన జాక్ ను  కొనసాగించడమే ఒక పెద్ద రాజకీయం. స్వాతంత్రం లక్ష్యంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యంలోనూ కొనసాగి రాజకీయాలు చేసినట్టు తెలంగాణా ఏర్పడ్డాక, లక్ష్యం నెరవేరినా జాక్ ను కొనసాగించాలని కోదండరాం నిర్ణయించుకున్నారు.  ఉద్యమ సందర్భంలో ఒక చారిత్రక వేదికగా నిలిచిపోయిన  టీజాక్  కోదండరాం తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకున్నాడనేది సుస్పష్టం. అదే కూలిపొయిన షెడ్డులొ ఆయన తన విఫల ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన జాక్ కొనసాగుతుందని  ప్రకటించారు. మొదటి బడ్జెట్ సమావేశాలు మొదలుకాకముందే ఆయన రైతుల ఆత్మ హత్యలను ఆయుధంగా చేసుకున్నాడు. 



రైతుల సమస్యలు తెలంగాణా రాష్ట్రంతో మొదలయినవి కాదు. వాటికి దేశవ్యాప్తంగా ఆర్ధిక విధానాలతో పాటుగా నైసర్గిక, వాతావరణ, కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద, రైతుల బలవన్మరణాల మీద  కోదండరామ్ కు లోతయిన అవగాహన ఉంది. కానీ ఆయన అత్యంత తేలికపాటి కారణాలు చూపుతూ, సరిఅయిన హోంవర్క్ చేయకుండానే తెలంగాణా ప్రభుత్వం మీద కోర్టులో కేసు వేశారు. కోర్టులో కూడా ఆయనకు అపజయమే ఎదురయ్యింది. ఇదే దశలో వ్యవసాయ రంగ సంక్షోభానికిప్రధాన కారణాల్లో ఒకటైన సాగునీరు అందించడంకోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను వదిలేసి నీటి పారుదలమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.  మిషన్ కాకతీయ తో పాటు అనేక ప్రాజెక్ట్ లను డిజైన్ చేసింది. అందులో భాగంగానే మల్లన్న సాగర్ ను రూపొందించింది. కోదండరాం వెంటనే దాని వ్యతిరేక పోరాటం మొదలు పెట్టారు. రైతులను కూడగట్ట లేక  ఆయన రాజకీయ పార్టీలను కూడగట్టి కోర్టుల్లోకి సమస్యను నెట్టేశారు. ఏకకాలంలో రైతుల ఆత్మహత్యలమీద, ఆ ఆత్మహత్యలకు విరుగుడుగా ప్రభుత్వం రూపొందించిన  నీటి ప్రోజెక్టుల మీద పోరాటం ప్రకటించిన ఆయన వ్యూహం ఏ రాజకీయ విశ్లేషకుడికి కూడా అంతుపట్టడం లేదు. అక్కడితో ఆగలేదు రైతులకు నిరంతర విద్యుత్తు ఇవ్వడాన్ని తెలంగాణా సమాజం హర్షిస్తుంటే ఆయన తన కోచైర్మన్ రఘు తో కరెంట్ కొనుగోళ్ళమీద రాద్ధాంతం చేసే ప్రయత్నమా చేశారు.  నదులు మళ్లించకుండా పొలాలు పారించాలని, భూమిసేకరించకుండా రిజర్వాయర్లు కట్టాలని, నీళ్లు ఇవ్వాకుండా రైతాంగ సంక్షోభాన్ని నివారించాలని, విద్యుత్ కొనకుండా ఇరవైనాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని ఆయన ఒక విచిత్రమైన అజెండా రూపొందించుకున్నారు.ఈ మూడు ఉద్యమాలూ వ్యూహాత్మక తప్పిదాలుగానే మిగిలి పోయాయి. ఆయన ఉద్యమం సమస్యమీద కాదని, ప్రభుత్వం మీద అని అందరికీ అర్థమై పోయింది. అది ప్రభుత్వానికి బాగా అర్థమయినట్టుంది. 


నిజానికి ఇవన్నీ ఆయనకు అర్థం కాలేదని అనుకోలేం. కానీ వైఫల్యాలు వ్యక్తుల ఆలోచనలను చంపేస్తాయి.  వైఫల్యాలు ఎదురౌతున్న కొద్దీ మనుషుల్లో అసహనం పెరిగిపోతుంది, ఒక్క విజయమైనా ఖాతాలో పడాలనే తహతహ పెరిగిపోతుంది.  ఆ దశలో ఇంతపెద్ద మేధావులైనా బలహీన పడిపోతారు . మరిన్ని అనాలోచిత పనులు చేస్తుంటారు. నిరుద్యోగం పై ప్రొ. కోదండరాం మదిలో మెదిలిన కొత్త ఆలోచనా అందులో భాగమే.  అనాలోచిత నిర్ణయం కాకపోతే కొనసాగుతోన్న ప్రక్రియ పై ఎవరైనా యుద్ధం మొదలుపెడతారా? 2015 సెప్టెంబర్ లో ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండరాం, చుక్కా రామయ్య లాంటి మేధావులంతా కలిసి తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ విడుదల చేశారు. ఆ వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన నోటిఫికేషన్లు మొదలుపెట్టి గడిచిన ఏడాదిన్నర కాలంలో 24 నోటిఫికెషన్స్ ఇచ్చి పరీక్షలు కూడా పూర్తి చేసింది. దాదాపు 5 వేలమందికి పైగా ఉద్యోగాల్లో చేరినట్టు చెపుతున్నారు. అదే సిలబస్ ను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు , ట్రాన్స్కో, జెంకో, సింగరేణి సహా మిగితా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా తీసుకున్నాయి. వాళ్ళ నోటిఫికెషన్స్ కూడా వచ్చాయి, ప్రక్రియలు గతంలో ఈ రాష్ట్రంలో జరిగినదానికంటే, ఇప్పుడు దేశంలో జరుగుతున్న దానికంటే వేగంగా, పారదర్శకంగా, పకడ్బందీగానే జరుగుతోంది. అలాంటి దశలో ప్రో. కోదండరాం విద్యార్థులను, యువకులను వెంబడేసుకుని 'వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలి' అని అల్లరి చేయడంలో ఆంతర్యం ఏమిటి? తన రాజకీయ క్యాలండర్ ను కనీసం జేఏసీ లోని తన సమీప అనుచరులకు కూడా చెప్పని కోదండరాం పరీక్షల క్యాలండర్ అడగడంలో అర్థం ఏమిటి?. గురుకుల పాఠశాలల్లో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ క్లాస్ వద్దని, ఇంగ్లీష్ మీడియం వద్దని, అసలు పరీక్షే వద్దని మూడు రోజులపాటు నానా యాగీ చేసి ఆ నోటిఫికెషన్స్ రద్దు చేయించిన కోదండరాంకు ఉద్యోగాల విషయంలో మాట్లాడడానికి ఉన్న అర్హత ఏమిటి? ఉస్మానియాలో నిరుద్యోగ జాక్ ఉండగా మళ్ళీ ఈ పొలిటికల్ జాక్ పోకడేమిటి? ఇవన్నీ ప్రో కోదండరాం రాజకీయ అయోమయానికి అద్దం  పట్టే ప్రశ్నలు. ప్రొ. కోదండరాంను ఆయనకే అర్థం కాని రాజకీయ శక్తి ఏదో ఆవహించింది. వీలయితే తక్షణం ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, కుదరకపోతే మళ్ళీ ఎన్నికలనాటికి పార్టీ పెట్టి పోటీ చేయడం ఆయన ప్రధాన లక్ష్యం. అందులో కుల, వర్గ ప్రయోజనాలు ఎలా ఉన్నాయనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆ లక్ష్యం లో భాగంగానే ఆయన గడిచిన రెండున్నరేళ్లు ఆయనే పదేపదే  చెపుతున్నట్టు కాలికి బలపం కట్టుకుని లక్షల కిలోమీటర్లు తిరిగారు కానీ లక్ష్యాన్ని మాత్రం చేరలేక పోయారు. అటువంటి బలహీనమైన క్షణంలో ఆయనకు నిరుద్యోగులు కంటపడ్డారు, ఉస్మానియా పిల్లలు కంటపడ్డారు. భావోద్వేగాలను రెచ్చగొడితే ఉద్యమం నిలబడుతుందని భావించారు. కానీప్రొఫెసర్ గారి  పాఠం పిల్లలకు  తలకెక్కక పోగా జాక్ కు ఒక పెద్ద గుణపాఠమై మిగిలింది. 


ఇంత జరిగినా సమీక్షించుకోకుండా ఆయన ఇప్పుడు తెలంగాణా వాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తనకు తానుగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్, మానవీయ పౌరసమాజ భావన రూపశిల్పి  డా. కె. బాలగోపాల్ తో సరిసమానంగా పోల్చుకుంటున్నాడు.నిజానికి  వారిద్దరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. రాజకీయ అవసరాలు లేవు. ఒకరిది  తెలంగాణా ఆశైతే, ఇంకొకరిది హక్కుల ధ్యాస. ఇద్దరికీ సొంతగా అజెండా లేదు. వాళ్ళ దారిలో రాజకీయ నాయకులు నడిచి ఉండవచ్చు కానీ ఏనాడూ ఏ రాజకీయ నాయకులతో వాళ్ళు నడవలేదు. ఎవరినైనా బహిరంగంగానే నిలదీశారు తప్ప ఎవరితోనూ రహస్యంగా సంప్రదింపులు జరుపలేదు. వారిద్దరూ ఉద్యమాలకు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు, ఉద్యమ కాలంలో జీతాలను కూడా త్యాగం చేయలేని వాళ్ళు, వాళ్ళతో పోల్చుకోవడం కూడా అపచారమే.! వారికి సాటిగల వారు ఇంకెవరూ లేరు, ఉండరు. ఇది ప్రో. కోదండరాం కు తెలుసు అయినా ఆయన వారిచుట్టూ తన సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర అనంతర తెలంగాణా లో ప్రత్యామ్నాయం లేకపోవడం బాధాకరమే, కానీ కోదండరాం కులం రీత్యా, వర్గ రాజకీయాల రీత్యా, వ్యవహార శైలి రీత్యా అది సాధ్యం కాదు. కోదండరాం తో దాదాపు ముప్పై ఏళ్ళు కలిసి ఒకే రాజకీయ సిద్ధాంతాలు పంచుకుని నడిచిన వ్యక్తుల్లో డా. చెరుకు సుధాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్యలు. ఇవాళ కోదండరాం ప్రత్యామ్నాయం కాజాలడని  డా. చెరుకు సుధాకర్ బహిరంగంగానే చెపుతున్నాడు. మూడు దశాబ్దాలు నూతన ప్రజాస్వామిక పంథాను అనుసరించిన కోదండరాం లో ప్రజాస్వామిక రాజకీయ విలువలే లేవని ఎత్తి చూపుతున్నాడు. ఒక రకంగా మల్లేపల్లి లక్ష్మయ్య లేకపోతే కోదండరాం  విద్యావంతుల వేదిక ఇంతకాలంనడిపేవాడు కూడా కాదు.   ఆ సంగతి ఎప్పుడో అర్థం చేసుకున్న మల్లేపల్లి లక్ష్మయ్య కొత్త మార్గంలో వెళ్ళిపోయాడు. ప్రొ. కోదండరాం తన పరిమితులు  గ్రహించకుండా ఇంకా ఆయన తన రాజకీయ విన్యాసాలు చేస్తూ పోతే ఆయన తెలంగాణలో ప్రజాస్వామిక విలువలకు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న స్పేస్ ను కూడా లేకుండా చేసిన వారు అవుతారు. 

డా. రాహుల్ రాజారామ్ 


Comments

  1. Great analysis. MKR is a self centred person carrying an hidden agenda of bringing his own caste/community into power.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం

ఫెడరల్ ఫ్రంట్: చెప్పాల్సింది ఇంకా ఉంది!